सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

5 mins read

సేంద్రీయ వ్యవసాయం - కర్ణాటక రైతుల విజయ రహస్యం

కిషన్ జీ మర్ల | మధ్యప్రదేశ్

parivartan-img

" విజేతలు భిన్నమైన పనులేం చేయరు.పనులను భిన్నంగా చేస్తారు" అనే సామెత మనందరికీ సుపరిచితమే. ఈ సామెతను నిజం చేస్తున్నారు కొందరు కర్ణాటక రైతులు. కర్ణాటకలోని సాయవ కృషి పరివార్ సంస్థ విభిన్నంగా ఆలోచించి ఇక్కడి రైతులకు సేంద్రియ వ్యవసాయాన్ని పరిచయం చేసింది. యిది ఎంతోమంది పేద రైతుల జీవితాలనే మార్చేసింది. సేంద్రీయ పద్ధతుల్లో వ్యవసాయం చేయడమే కాకుండా మధ్య దళారీలు లేకుండా వారి ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకే అమ్మగలిగే వేదికను తయారు చేసింది.

ఒకప్పుడు తుంకూర్ జిల్లాలోని బిల్గేరేపాళ్యకు చెందిన చంద్రప్రకాష్ అనే రైతు ఒక క్వింటాల్ రాగులు అమ్మితే 2500 రూపాయలు వచ్చేవి, కానీ ఇప్పుడు క్వింటాల్ రాగులు అమ్మి 22,500 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఆశ్చర్యంగా ఉందా ? తన సంపాదనలో అంత పెద్ద మార్పు చూసిన మొదటి సారి చంద్రప్రకాష్ కూడా ఆశ్చర్య పోయాడు. ఆర్ ఎస్ ఎస్ సీనియర్ ప్రచారకులు ఉపేంద్ర షినోయ్ గారి స్ఫూర్తితో, సంపన్న రైతు పురుషోత్తం రావు గారి కృషితో 1990లలో ఏర్పడిన సాయవ కృషి పరివార్ సంస్థ నేడు సేంద్రియ వ్యవసాయరంగంలో ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థగా అవతరించింది.ఇప్పటివరకు ఈ ప్రాంతంలో 15 వేల మంది రైతులను విజేతలుగా తీర్చిదిద్దింది ఈ సంస్థ. ప్రాథమికంగా ఈసంస్థకు కొన్ని చిన్నా, పెద్ద వ్యవసాయ సంఘాలు అనుబంధంగా పనిచేస్తున్నాయి. ఈ సంఘాలు సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడమే కాకుండా దళారీలు లేని మార్కెటింగ్ వ్యవస్థను రైతులకు అందుబాటులోకి తెస్తున్నాయి.


సేంద్రియ ఎరువులు మొదలుకొని, బయోగ్యాస్ వినియోగం,తేనె ఉత్పత్తి, గోమూత్రం,గోమయం మార్కెటింగ్ దాకా వ్యవసాయాన్ని లాభదాయకం చేసే అన్ని ప్రయత్నాలు మేం చేస్తున్నామంటున్నారు ఈ సంస్థ కోసమే పూర్తి సమయమిస్తూ అంకితభావంతో పని చేస్తున్న స్వయంసేవకులు ఆనంద్ జీ. SKP(సాయవ కృషి పరివార్ )కృషక్ - గ్రాహక్ మిలన్ మేళాపేరుతో పక్షం రోజులకు ఒకసారి ప్రత్యేక మేళాలు నిర్వహిస్తున్నది. ఇక్కడ రైతులు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకే అమ్ముతారు. బళ్లారి జిల్లాలోని హుళికరై గ్రామానికి చెందిన పేద రైతు మలయార్ శరణప్ప విసుగుచెంది వ్యవసాయం మానేద్దామనుకున్నాడు. అటువంటి శరణప్ప ఇప్పుడు తన ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అమ్ముతూ సంవత్సరానికి 4.5 లక్షలు సంపాదిస్తున్నాడు. ఎస్ కే పి పరిచయం అయిన తర్వాత ఆయన జీవితం పూర్తిగా మారిపోయింది. రైతులు, వినియోగదారులతో జరుగుతున్న మేళాలలో నెలకు 20 లక్షల రూపాయల టర్నోవర్ జరుగుతున్నది.

ఇటుకపై ఇటుక పేర్చినట్టుగా తమ సంపర్కంలోకి వచ్చిన రైతుల జీవితాల్లో పెనుమార్పులు తీసుకువచ్చింది SKP. సరికొత్త పరిజ్ఞానాన్ని సముపార్జించిన రైతులు ఇప్పుడు కొత్త ఆదాయ మార్గాల్లో పయనిస్తున్నారు.వారు లీటరు పాలను 80 రూపాయలకు అమ్మకుండా నెయ్యి తయారు చేసి రెండు వేల రూపాయలకు కిలో చొప్పున అమ్ముతున్నారు. ఈ కుటుంబాలకు చెందిన స్త్రీలు కూడా మార్కెట్లో నిరంతరం డిమాండ్ ఉంటున్న సేంద్రియ కుంకుమను అమ్ముతూ బాగా సంపాదిస్తున్నారు.


ఎస్ కే పీ తో చేతులు కలిపిన రైతులు తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటున్నారు. కొందరు సేంద్రియ వ్యవసాయాన్ని తేనె ఉత్పత్తితో సమ్మిళితం చేయగా కొందరు గోమయాన్ని ప్రకృతి ప్రసాదించిన ఎరువుగా అమ్ముతూ బాగు పడుతున్నారు. ఎస్ కె పి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం మాత్రమే కాకుండా రైతులకు నాణ్యమైన విత్తనాలు లభించేలా, జల సంరక్షణ, భూసుపోషణ విధానాల మీద ప్రత్యేక శిక్షణ ఇస్తూ వారికి తోడ్పడుతున్నది.ప్రతి 2:15 గంటలకు ఒక రైతు ఆత్మహత్య చేసుకునే భారత్ వంటి దేశంలో SKP నిర్వహిస్తున్న కార్యక్రమాలు నిజంగా కారు చీకట్లో కాంతిరేఖ లాంటివే. బెంగుళూరుకు చెందిన రాష్ట్రోత్థాన పరిషత్ , యూత్ ఫర్ సేవ లాంటి సంస్థలు కూడా ఎస్ కె పి కి సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాయి.

882 Views
अगली कहानी